పొరుగు రాష్ట్రమైన కర్నాటక ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కొత్త ఆశలు రేకిత్తించినట్లు కనిపిస్తుంది. నిజంగానే వారికి ఆశలు కలిగినా,లేకున్నా, అలా కనిపించడానికి ముఖ్య పార్టీల నేతలంతా శాయశక్తులా కృషి చేశారనే చెప్పాలి.ఇక అక్కడ ప్రచారం చేసి వచ్చిన కాంగ్రెస్ నేతలకైతే ఇదంతా తమవల్లేనన్న సంతోషం కూడా ఎక్కువగానే ఉంది.తప్పులేదు. నిజమే.కాంగ్రెస్ పార్టీ పరాజయ పరంపరలో పడిపోతుందన్న భావన ఉన్న తరుణంలో ఒక రాష్ట్రంలో , అందులోను జాతీయ స్థాయిలో ప్రత్యర్ది అయిన బిజెపి పాలిత రాష్ట్రాన్ని గెలుచుకోవడం నైతికంగా కాంగ్రెస్ కు పెద్ద ఉపశమనం కలిగించే అంశమే.దాని ని స్పూర్తిగా తీసుకుని ఆంద్రప్రదేశ్ లో కూడా గెలుస్తామని అనడం లో కూడా తప్పు పట్టనవసరం లేదు. కాకపోతే అక్కడ పరిస్థితులు , ఇక్కడ పరిస్థితులు ఒకలా ఉన్నాయా అన్నది ప్రశ్న.ఇక్కడ ఒక పోలిక కనిపిస్తుంది. కర్నాటకలో బిజెపిలో చీలికలు, లుకలుకలు వచ్చినట్లుగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ లో చీలిక వచ్చింది.అక్కడ చీలిక బిజెపిని ఓడించేదిగాను, కాంగ్రెస్ కు ఉపకరించేదిగాను ఉంటే, ఇక్కడ చీలిక మాత్రం కాంగ్రెస్ ను సవాల్ చేసేదిగా ఉంది.అక్కడ బిజెపి మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కొందరు చెబుతున్నట్లు సిబిఐ భయమో, లేక పార్టీ తనకు అన్యాయం చేసిందన్న భావనతోనో పార్టీని చీల్చి పలు నియోజకవర్గాలలో దెబ్బకొట్టారు. ఆయన పట్టుమని పది స్థానాలలో కూడా గెలవలేకపోయినా ,కాంగ్రెస్ కు మాత్రం శిఖండిలా ఉపయోగపడ్డారు.నిజానికి కాంగ్రెస్ కు అక్కడ ప్రజలలో విశేష ఆదరణ ఉండి ఉంటే, కనీసం నూట ఏభై సీట్లు వచ్చి ఉండాలి. కాని నూట ఇరవై రావడమే కష్టమైపోయింది.విపక్షాలన్నిటికి కలిపి దాదాపు వంద స్థానాలు వస్తే, కాంగ్రెస్ కు నూట ఇరవై స్థానాలు వచ్చాయి.ఓట్ల విభజన వల్ల అక్కడ కాంగ్రెస్ లబ్ది పొందిందన్నది స్పష్టంగానే కనబడుతుంది.మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిస్థితులు వేరు. సమస్యలు వేరు. మామూలు రోజులలో అయితే పొరుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కొంత ఉండవచ్చు.కాని ఇక్కడ అలా లేదు.చిత్రంగా అక్కడ అదికార బిజెపినుంచి చీలిన పార్టీ బలహీనపడిపోతే, ఇక్కడ అదికార కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీ పెద్ద సవాలుగా మారుతున్నట్లు గత ఉప ఎన్నికలలో విజయడంఖా మోగించి సత్తా చాటుకుంది.అక్కడ ఎడ్యూరప్పపై సానుభూతి పవనాలు వీయలేదు. అక్కడ సిబిఐ ఎడ్యూరప్పపై కేసు పెట్టి ఇరవై రోజులు జైలులో పెట్టినా, ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.కాని ఇక్కడ జగన్ కు బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడుతోంది.కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడంతో జగన్ అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.ముఖ్యమంత్రి పదవి చేసిన ఎడ్యూరప్పకు బెయిల్ వస్తుంది.. లక్షా ఎనభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పిన 2 జి కేసులో కేంద్రమంత్రిగా పనిచేసిన రాజాకు బెయిల్ వస్తుంది. కాని ఇక్కడ సిబిఐ చెబుతున్నట్లు నేరాలు జరిగిన సమయంలో కనీసం ఎమ్.పి గా కూడా కాని జగన్ కు బెయిల్ రావడం లేదు. ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రగా ప్రజలు అనుమానిస్తున్నారు.